Monday, May 31, 2010

పెళ్లి కళ ... ఎక్కడెలా?


పెళ్ళంటే... అంటుంది హీరోయిన్.
పెళ్ళంటే పందిళ్ళు, సందళ్ళు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడే ముళ్ళు, ఏడే అడుగులు, మొత్తం కలిసి నూరేళ్ళు అని చెబుతాడు హీరో.
ఇది మన దేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లి. మనం ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి మనకు దీని గురించి తెలుసు. కానీ ఇతర దేశాల్లో వివాహ సంప్రదాయం ఎలా వుంటుంది! పొద్దున్న ఆఫీసుకి వస్తుంటే ఒక ఫంక్షన్ హాల్ దగ్గర పెళ్లి సందడి కనిపించింది. అప్పుడు వచ్చింది ఆ ఆలోచన. ఆఫీసుకి రాగానే వెంటనే ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూసా. వివాహ సంప్రదాయాల గురించి భలే ఆసక్తికరమైన విషయాలు కనిపించాయి. అవే ఇవి.  

మెక్సికో: పెళ్ళిలో వధూవరుల మెడచుట్టూ తెల్లటి రిబ్బన్ కడతారు.  పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి 13 బంగారు వెండి నాణాలు ఇస్తాడు. వీటిని ప్రీస్ట్ ప్రార్ధనలు జరిపి, ఆశీర్వదించి మరీ వరుడి చేతికి ఇస్తాడు. వరుడు వాటిని తీసుకెళ్ళి వధువు చేతిలో పెడతాడు. ఆమె ఆనందంగా స్వీకరిస్తుంది. ఒకరిపై ఒకరు నమ్మకం, ప్రేమ పెంచుకోటానికి, ఒకరికి ఒకరు కట్టుబడి ఉండటానికి సూచనగా దీన్ని భావిస్తారట!

ఇటలీ: ఇక్కడి వివాహాల్లో ప్రధాన పాత్ర వహించేది ఆహారం. వివాహ కార్యక్రమం ముగిసిపోయినదనిపించుకుని వధూవరులకు బాదాం పప్పుతో చేసిన చాక్లెట్లు వున్న బ్యాగ్స్ ఇస్తారు. ప్రత్యేకంగా తయారుచేసే ఈ చాక్లెట్లను కాన్ఫెట్టి అంటారు. జీవితమంతా తీయగా, ఆనందంగా సాగిపోవాలని దీవిస్తూ వీటిని ఇస్తారట. పెళ్ళికి హాజరైన అతిథులకు కూడా వీటిని ఇస్తారు. వధువుకు ఎలాంటి ఆభరణాలూ వేయరు. వేస్తే అసుభమని అనుకుంటారు. అంతేకాదు, పెళ్లి ఆదివారం జరిగితే మంచిదని భావిస్తారు.

శ్రీలంక: ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బౌద్ధ వివాహాల గురించి. వీటిని చూడటానికి రెండు చాలవని అంటారు. చెక్కతో చేసిన ప్రత్యేకమైన వేదికపై పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఈ వేదికలను వాళ్ళు మగల్ పొరు అంటారు.

మొరాకో: ఇక్కడ వధువు మెహందీ పెట్టుకోవడం తప్పనిసరి. అంతేకాదు, కాళ్ళమీద చేతుల మీద టాటూలు వేస్తారు. ఇవి అందానికే కాదు, అదృష్టాన్ని తెచ్చిపెడతాయని వాళ్ళు నమ్ముతారు.

చైనా: ఎరుపు రంగు వస్త్రాలకు ప్రాధాన్యమిస్తారు. ఆ రంగు జీవితంలో ఆనందాన్ని, ప్రేమను నింపుతుందని వారి విశ్వాసం. వధువు కేశాలంకరణకు చాల ప్రాధాన్యముంది. భర్త, బిడ్డలతో మంచి సంసార జీవితాన్ని గడుపుతున్న స్త్రీతో మాత్రమే వధువుకు కేశాలంకరణ చేయిస్తారు. అలా చేయిస్తే పెళ్లి చేసుకుంటున్న అమ్మాయి జీవితం సుఖప్రదంగా ఉంటుందని నమ్ముతారు.  అంతేకాదు, వధువు కేశాలు నాలుగుసార్లు దువ్వాలనే ఆచారం కూడా వుంది. పెళ్లి జరిగిన తర్వాత కొత్త జంట పరస్పరం కర్చీఫులు బహుమతిగా ఇచ్చుకుంటారు. ఆ కర్చీఫులు ఎరుపు రంగులో వుంటాయి. వాటి మీద బాతుల బొమ్మలుంటాయి. బాతులు ఒకసారి జంట కడితే జీవితాంతం కలిసే ఉంటాయట. అందుకని ఆ బొమ్మలు ఉన్నవాటినే ఇచ్చి పుచ్చుకుంటారు.

ఐర్లాండ్: ఇక్కడ వధువు ధరించే గౌన్ ను హార్స్ షూ షేపులో తయారు చేస్తారు. హార్స్ షూ అంటే యు ఆకారంలో వుండే ఒక టూల్. ఆ ఆకారంలో వుండే దుస్తులను ధరిస్తే అదృష్టం వరిస్తుందని వారి నమ్మకం. వధువు చేతిలో ఉంచే పూలగుత్తిలో ఒక హార్స్ షూను కూడా ఉంచుతారు.

బ్రెజిల్: ఇక్కడ ఒక వింత ఆచారం వుంది. వధువును కావాలనే ఆలస్యంగా తీసుకొస్తారు. వివాహ కార్యక్రమం మొదలు కాకముందు వరుడు ఆమెను వివాహ వస్త్రాలలో చూడకూడదనేది వారి ఉద్దేశం.

జర్మనీ: ఇద్దరికి వివాహం జరిపించాలని నిర్ణయించిన తర్వాత, పెళ్ళికి కొన్ని రోజుల ముందు ఒక తంతు వుంటుంది. ఇద్దరినీ కూర్చోబెట్టి వారి ముందు బంధువులు పింగాణీ పాత్రలను నేలకేసి కొడతారు. ఇలా వాటిని విరగ్గొట్టడం వల్ల నూతన దంపతులకు శుభం చేకూరుతుందని వాళ్ళు నమ్ముతారు.

తైవాన్: పెళ్లిరోజు ఉదయం వరుడు వధువు ఇంటికి వెళ్తాడు. ఆమె తల్లిదండ్రుల ముందు మోకాళ్ళ మీద కూర్చుని 'మీ అమ్మాయిని బాగా చూసుకుంటాను' అని వొట్టు వేసి, ఆమెను తనతో పంపించమని అడుగుతాడు. వాళ్ళు దానికి అంగీకరిస్తారు. అప్పుడతడు వధువును తీసుకుని పెళ్లి జరిగే చోటికి వెళతాడు. ఆ తర్వాత వివాహ కార్యక్రమం జరుగుతుంది.

టర్కీ: ఇక్కడొక వింత ఆచారం వుంది. పెళ్ళికూతురి చెప్పుల మీద పెళ్లి కానీ ఆమె స్నేహితురాళ్ళు తమ పేర్లు రాస్తారు. పెళ్లి జరిగిన తర్వాత చెప్పులు తీసి చూస్తారు. వాటి మీద ఎవరి పేరైనా చెరిగిపోతే ఆ అమ్మాయికి త్వరలోనే పెళ్లైపోతుందని నమ్ముతారు. ఇలాంటిదే కొరియాలో కూడా ఒకటుంది. వధువు తన చేతిలోని పూలగిత్తిని వెనక్కు విసురుతుంది. దానిని పట్టుకున్న అమ్మాయికి వెంటనే పెళ్లైపోతుందని అక్కడివాళ్ల విశ్వాసం.

ఇరాన్: పెళ్లి ముందురోజు రాత్రి నలుగురు పెళ్ళికాని అమ్మాయిలు వధువు ఇంటికి వెళ్తారు. వధువును పీట మీద కూర్చోబెట్టి, ఆమె తల మీదుగా ఒక తెల్ల వస్త్రాన్ని పట్టుకుంటారు. ఒక అమ్మాయి తిరగలిలో పంచదార వేసి నూరటం మొదలెడుతుంది. ఇలా చేయటం వల్ల దుష్ట శక్తులు దూరంగా పోయి, ఆమె వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుందని వారి నమ్మకం. అయితే పంచదార నూరే అమ్మయిని ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు.  సంప్రదాయాలను గౌరవిస్తూ, మర్యాదగా నడచుకునే అమ్మయితోనే ఆ పని చేయిస్తారు.
    
          ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వెడ్డింగ్ ట్రెడిషన్స్ వున్నాయి. ఎవరి ఆచారాలు వారివి... ఎవరి నమ్మకాలు వారివి.

Tuesday, May 25, 2010

మూగవోయిన మధురవీణ


సెంచరీలు కొట్టే వయస్సు మాది అంటూ పాట రాసిన ఆ మహాకవి డెభ్భై నాలుగేళ్ళకే తనువు చాలించాడు. తెలుగు సినిమా సాహిత్యసీమలో పాటల పూదోట విరబూయించిన ఆ మహనీయుడు పరలోకానికి పయనమయ్యాడు. అశేష ప్రజానీకాన్నీ తన అక్షరాల గుభాలింపుతో ముగ్ధుల్ని చేసిన వేటూరి భువిని విడిచి దివికి చేరిపోయాడు. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా పాటను మన జీవితాల్లో ఒక భాగాన్ని చేసిన కలం కదలికలు శాశ్వతంగా ఆగిపోయాయి.

      ఆ కలం అమ్మలా జోల పాడింది. ఆ కలం నాన్నలా నీతిని నేర్పింది. ఆ కలం కన్నీళ్ళ కళ్ళాపి చల్లింది. ఆ కలం నవ్వుల జల్లు కురిపించింది. ఆ కలం కలల కవాటాలు తెరిచింది. ఆ కలం విషాదానికి విడిదిగా మారింది. ఏ భావాన్ని పలికించినా, ఏ రాగానికి అక్షరాలతో సొబగులు అద్దినా ప్రతి పదంలోనూ వేటూరి శైలి కదం తొక్కుతుంది. ప్రతి మాటలోనూ భాషకు సైతం అందని భావమేదో దోబూచులాడుతుంది. తెలుగు సినిమా సాహిత్య లోకంలోకి పిల్ల తెమ్మెరలా వచ్చి ప్రభంజనమై పోయాడు. అలతి అలతి పదాలతో అభిమానుల హృదయాల్లో పీట వేసుకుని కూర్చున్నాడు. అలసిన మనసులకు తన మాటలతో సేద తీర్చాడు. గాయపడిన హృదయాలకు పదాలతో వైద్యం చేసాడు. మండిన గుండెలకు తన అక్షరాలతో ఆవేశాన్ని ఆజ్యంగా పోసాడు. కలాన్ని కత్తిలా దూసాడు... సాహితీప్రియుల హృదయ సామ్రాజ్యాల్ని గెలుచుకున్నాడు.

       వింత వింత పద ప్రయోగాలతో తెలుగు బాషకు కొత్త సొబగులను అద్దిన వీరుడు వేటూరి. తన మాత్రుబాషకు జాతీయ హోదా ఇవ్వలేదన్న కోపంతో జాతీయ అవార్డును తోసిపుచ్చిన ధీరుడు వేటూరి. ఆయన కలం పదునుకు అక్షరాల కుత్తుకలు తెగిపడతాయి. భారమైన భావాల మడుగులో పడి ఊపిరాడక విలవిలలడతాయి. అయినా ఆయన జాలి చూపలేదు. తన అక్షర అస్త్రాన్ని శ్రోతల హృదయాలకు గురిపెట్టక మానలేదు. భువనానికి వేణువై వచ్చానన్నాడు. గగనానికి గాలిని పోతానన్నాడు. మనసును తుల్లిపడకంటూ వారించాడు. అతిగా ఆశపడకు అంటూ హితవు పలికాడు. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ నిలదీశాడు. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే అంటూ వేదాంతాన్ని కుమ్మరించాడు. పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయలేనంటూ బాధ పడిపోయాడు. ప్రతిరోజూ నీకొక పాఠమే తెలుసుకుంటూ పద అంటూ జ్ఞానబోధ చేసాడు. ఆమనీ పాడవే అంటూ ప్రకృతిని పలకరించి పులకరించాడు. నీ కబళం పడతా... నిను పట్టుకుపోతా అంటూ భయపెట్టి పరుగులెత్తించాడు. ఆకు చాటు పిందేను తడిపి అల్లరి పెట్టాడు. కాటుకలంటుకున్న కౌగిలింత లెంత హాయి అంటూ కుర్రకారుకు గిలిగింతలు పెట్టాడు. నవరసాలనూ తనదైన శైలిలో వొలికించాడు. ప్రతి శ్రోత పెదవిపై తన పదాలను పలికించాడు.  

      అక్షరాలతో మాలికలల్లి కళామతల్లి కంఠాన్నిఅలంకరించిన వేటూరి కళ్ళు శాస్వతంగా మూతబడ్డాయి. ఆయన సృష్టించిన అద్భుత సాహితీ సౌరభాన్ని ఎన్నో ఏళ్ళుగా ఆస్వాదిస్తోన్న అభిమానుల మనోవీణా తంత్రులు తెగిపోయాయి. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాదీ వెన్నెలమ్మ అన్నాడాయన. అలాగే ఎందఱో రచయితలు వస్తారు కానీ వేటూరి మాత్రం రారు. ఎప్పటికీ రారు.
 

Friday, May 21, 2010

ఎలా జరిగిందబ్బా!

కొన్ని సంఘటనలు యాదృచ్చికంగా జరిగిపోతూ వుంటాయి. అమితాశ్చర్యాన్ని కలుగజేస్తాయి. అలా ఎలా జరిగిందబ్బా అని జుట్టు పీక్కునేలా చేస్తాయి. అలాంటి కొన్ని సంఘటనలు ఇవి...

* అది 1893 వ సంవత్సరం. హెన్రీ జిగ్లాండ్ అనే వ్యక్తి తన గాళ్ ఫ్రెండ్ కి ఏదో కారణంతో గుడ్ బై చెప్పేసాడు. అది ఆమె తట్టుకోలేకపోయింది. అతను లేని జీవితం వద్దనుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలియగానే ఆమె అన్న, హెన్రీ ఇంటికి వెళ్ళాడు. గన్ తీసి గార్డెన్ లో కుర్చుని వున్న హెన్రీని షూట్ చేసాడు. అయితే హెన్రీ త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ తుపాకీ గుండు తిన్నగా వెళ్లి ఒక చెట్టులోకి చొచ్చుకుపోయింది.

         అది 1913 వ సంవత్సరం. తన గార్డెన్లో వున్న కొన్ని చెట్లను నరికి పారేయాలనుకున్నాడు హెన్రీ. ఒక పెద్ద చెట్టును కూల్చటానికి డైనమైటును అమర్చాడు. అది పేలింది. అంతే... ఒక్కసారిగా పెద్దగా అరిచి కుప్ప కూలిపోయాడు హెన్రీ. కారణం... ఇరవయ్యేళ్ళ క్రితం తన ప్రేయసి అన్న పేల్చిన తూటా అదే చెట్టులో ఇరుక్కుంది. ఇప్పుడు అది బయటికి వచ్చి హెన్రీ గుండెల్లోకి దూసుకుపోయింది. దేవుడు ఆ తూటా మీద హెన్రీ పేరు రాసి పారేసాడు కాబోలు. అందుకే ఇరవయ్యేళ్ళ తర్వాత అయినా అది తన బాధ్యత తను నెరవేర్చింది.

* 1960, డిసెంబర్ 5 ... ఫ్రాన్సులోని డోవర్ జలసంధిలో ఒక ఓడ మునిగిపోయింది. అందరూ చనిపోయారు, ఒక వ్యక్తి తప్ప. అతని పేరు హ్యూ విలియమ్స్.
1767 , డిసెంబర్ 5 ... అదే జలసంధిలో మళ్లీ ఒక ఓడ మునిగిపోయింది. 127 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తప్ప. ఆ ఒక్కరి పేరు హ్యూ విలియమ్స్.
1820 , ఆగష్టు 8 ... థేమ్స్ నదిలో ఒక పడవ మునిగిపోయింది. ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక వ్యక్తి హ్యూ విలియమ్స్.
1940 , జూలై 10 ... జర్మన్ సైన్యం ఒక బ్రిటిష్ నౌకను నాశనం చేసింది. ఒక వ్యక్తి, అతని మేనల్లుడు మాత్రమే మిగిలారు. అదేం విచిత్రమో... ఆ ఇద్దరి పేరూ హ్యూ విలియమ్సే.

* 1996 ... ప్యారిస్...
అర్ధరాత్రి పోలీసులకు యాక్సిడెంట్ అయ్యిందని ఒక ఫోన్ వచ్చింది. పోలీసులు వెంటనే ఆ ప్రదేశానికి వెళ్లారు. రెండు కార్లు గుద్దుకుని తుక్కుతుక్కు అయిపోయాయి. డ్రైవ్ చేస్తున్న ఇద్దరూ చనిపోయారు. వారిలో ఒకరు ఆడ, ఒకరు మగ. ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళిద్దరూ భార్యాభర్తలని తేలింది. అంతకన్నా విచిత్రమయిన విషయం ఏమిటంటే, అప్పటికి ఎన్నో నెలల క్రితమే వాళ్ళిద్దరూ విడిపోయారట. అంతే ఇప్పుడు ఒకరికి తెలియకుండానే ఒకరు బయటకు వచ్చారు. ఒకరి కారును ఒకరు గుద్దుకుని చనిపోయారు. ఈ విషయం అర్ధమవగానే పోలీసులు చాలా ఆశ్చర్యపోయారట.
      పాపం... కలసి జీవించలేదు కానీ కలసి జీవితాన్ని చాలించారు కదూ!

* 1990 ... నార్త్ వేల్స్
పదిహేనేళ్ళ పిల్లాడు పదో తరగతి పరీక్ష రాయటానికి కూర్చున్నాడు.
ఆ పిల్లాడి పేరు... జేమ్స్ బాండ్.
అతని రోల్ నంబర్... 007

* ఈ సంఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది.
ఒక సభలో ప్రసంగించటానికి ఒక ప్రముఖ వ్యాపారవేత్త వచ్చాడు. అతని పేరు డేనీ డే. ఆరోజు అతను 'చావు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి మనమే జాగ్రత్తగా వుండాలి' అనే టాపిక్ మీద అనర్గళంగా మాట్లాడాడు.
స్పీచ్ ముగిసింది. మాట్లాడి అలసిపోయిన డేనీ ఒక పెప్పర్ మింట్ తీసుకుని నోట్లో వేసుకున్నాడు. అది కంఠానికి అడ్డుపడి అక్కడికక్కడే చనిపోయాడు.

     చరిత్రను తవ్వడం మొదలు పెడితే ఇలాంటి విచిత్రాలు, నమ్మలేని నిజాలు ఎన్నో బయట పడతాయి. ఇంటర్నెట్ సాగరాన్ని మదిస్తున్నపుడు నాకు తెలిసిన, నన్నెంతో ఆశ్చర్యపరిచిన కొన్ని విషయాలివి.  

Thursday, May 20, 2010

బాబోయ్...ఇదేం క్యాండీ!


ఇదేమిటి... పొరపాటున క్యాండీ చేసేటప్పుడు తేలు అందులో ఉండిపోయింది అనుకుంటారు చూసినవాళ్లు. కానీ అది పొరపాటేమీ కాదు. కావాలనే అలా తేలుతో క్యాండీ చేసారు.



చైనాలో రకరకాల జంతువులను, పురుగులను తింటారని మనకు తెలుసు. అయితే అదంతా ఆరోగ్య పరిరక్షణలో భాగమని చాలామందికి తెలియదు. ఇప్పుడు వాళ్ళు తేళ్ళు తినటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దానికి కారణం కూడా వాళ్ళు చెబుతున్నారు. తేళ్ళలో ఆరోగ్యానికి పనికి వచ్చే అంశాలు  చాలా వున్నాయట. కొన్ని రకాల కాన్సర్లను నివారించటంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయతాయని అంటున్నారు. దానికోసం తేళ్ళను ప్రత్యేకంగా పెంచుతున్నారు. రకరకాలుగా తేళ్ళు తమ ఆహారంలో ఉండేలా చూసుకుంటున్నారు. ఆ క్రమంలో వచ్చినవే ఈ క్యాండీలు. వీటికి అక్కడ భలే గిరాకీ వుందట. ఈ క్యాండీలు తింటే దంతాలకు కూడా మంచిదట. అందుకే జనం ఎగబడి కొంటున్నారు. లొట్టలేసుకుంటూ క్యాండీలు స్వాహా చేసేస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదయితే అయ్యింది కానీ మరీ తేళ్ళు తినటమంటే... అమ్మో... నావల్ల కాదు బాబూ!



Monday, May 17, 2010

నేను స్త్రీవాదిని కాను


ఆడదే ఆధారం, మన కధ ఆడనే ఆరంభం అంటూ పాటలు కట్టారు. వాటిని విని ఆనందించమన్నారు కానీ మనసులో నిలుపుకొమ్మని ఎవరూ చెప్పలేదా? ఆడవాళ్ళు పూజింపబడే చోట దేవతలు కొలువై ఉంటారని మాట వరుసకే అన్నారా? ఆ మాటలను దృష్టిలో ఉంచుకుని ఆడవాళ్ళను పూజించాల్సిన అవసరం లేదా? పోనీ పూజించాల్సిన అవసరం లేదు... కనీసం గౌరవిస్తే చాలు కదా! ఆ కాస్త గౌరవం కూడా దక్కటం లేదే ఆడదానికి! ముఖ్యంగా మన దేశంలో.
ఆడదానికి వేదాలలో చోటు దక్కింది కానీ మగాడి మనసులో దక్కటం లేదే. ఆడది మహామహులకు జన్మనిచ్చింది కానీ ఎన్ని జన్మలెత్తినా కనీసం మనిషిగానయినా మర్యాదను అందుకోవటం లేదే! స్త్రీ మగాడితో సమానంగా పదవులను అలంకరిస్తోంది, స్త్రీ అంతరిక్షంలో అడుగుపెట్టింది, స్త్రీ అన్నిటా ముందడుగు వేస్తోంది, నిజంగా మగాడు సహకరించకపోతే ఇవన్నీ సాధించగలిగేదా... ఈమధ్య ఒక మగ మహారాజు అన్న మాటలివి. అసలు ఆడది ఎదగటానికి మగాడి అనుమతి ఎందుకు కావాలట అన్నాను నేను. అంటే... అంతా మీ ఇష్టమేనా అన్నాడతను కినుకగా. నాకు నవ్వొచ్చింది. తండ్రిగా వున్నపుడు మగాడు బాగుంటున్నాడు. కూతురిని కొడుకులతో సమానంగా చదివిస్తున్నాడు. అన్నగా వున్నపుడు మగాడు బాగుంటున్నాడు. చెల్లెలికి అన్నిటా తోడుగా ఉంటున్నాడు. మగాడు స్నేహితునిగా వున్నపుడు బాగానే ఉంటున్నాడు. తన నేస్తం మీద ఎలాంటి నీలి నీడలూ పడకుండా కాపాడుకుంటున్నాడు. కానీ మగాడు భర్త స్థానంలోకి రాగానే ఎందుకు మారిపోతున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానం నాకు తెలిసి ఏ మగాడూ చెప్పలేదు. దీనికి సమాధానం స్త్రీ దగ్గర మాత్రమే దొరుకుతుంది.
ఒక ఆడపిల్ల విషయంలో తండ్రి, అన్న, స్నేహితుడు తమకు బాధ్యత ఉందనుకుంటారు. కేవలం భర్త మాత్రమే ఆమెపై తనకు హక్కు వుందనుకుంటాడు. ఆమె తన సొత్తు అనుకుంటాడు. జీవితమంతా ఆమె తన దగ్గర వుండి తీరాలనుకుంటాడు. తను లేకపోతే ఆమెకు మనుగడ లేదనుకుంటాడు. తను కాదంటే ఆమెకు జీవితమే లేదనుకుంటాడు. తను మాత్రమే ఆమె ప్రపంచమనుకుంటాడు. ప్రపంచంలో తను తప్ప ఆమెకు మరే దిక్కూ లేదనుకుంటాడు. ఆమె ప్రపంచాన్ని తన కళ్ళతోనే చూడాలనుకుంటాడు. అక్కడే సమస్యంతా.
భార్య తనకు నచ్చిన కూర వండాలి. తనకు నచ్చిన చీర కట్టాలి. తనకు నచ్చినట్టు జడ వేయాలి. తనకు నచ్చిన వారితో మాట్లాడాలి. తనకు నచ్చితేనే వుద్యోగం చేయాలి. నా, నేను, నాకు... ఈ మూడు మాటలు మగాడే ఎందుకు ఎక్కువ వాడతాడు? ఆడది ఆ మాటలు వాడితే ఎందుకు ఆవేసపడతాడు? ఆడది అనుకునేముందు తను కూడా మనిషే అని ఒక్కసారి అనుకోవచ్చు కదా! నాకు ఇది ఇష్టం అని చెప్పినపుడు నీకేమి ఇష్టం అని అడగవచ్చు కదా! నువ్వు నాకు నచ్చినట్టు వుండు అని ఆజ్ఞలు జారీ చేసేటప్పుడు, ఆమెకు నచ్చినట్టు ఉండటానికి కాస్తయినా ప్రయత్నించవచ్చు కదా! ఇవన్నీ వాళ్లకు ఎలా అర్ధమవుతాయి?
భార్య శరీరంతో పాటు మనసును కూడా తడిమే ప్రయత్నం మగవాడు చేయడే? ఒక్కసారి ఆ ప్రయత్నం చేస్తే ఆడది జీవితమంతా అతని చేయి విడువదని వాళ్లకు ఎలా అర్ధమవుతుంది! బతుకంతా నీ మనసు తెలుసుకుని నడచుకుంటానని బాస చేస్తే, బానిసగానైనా బతికేంతగా ప్రేమించేస్తుందని ఎలా చెబితే తెలుస్తుంది! ఇష్టాలను గౌరవించకపోయినా, కనీసం కించపరచకుండా వుంటే... తన ఇష్టాలను సయితం మర్చిపోయి అతని ఇష్టాలు తీర్చటమే పరమావధిగా జీవిస్తుందని ఎలా అవగతమవుతుంది!
పిడికెడంత ప్రేమను పంచి పెడితే... మగాడిగా అతనిని గెలిపించటం కోసం ఆడదానిగా తను ఆనదంగా ఓడిపోతుందని ఎప్పుడు అర్ధమవుతుంది!
చిరునవ్వుతో చిన్న పలకరింపు... ఆప్యాయత నిండిన మెత్తని స్పర్శ... కన్నీరు చిందిన వెల అక్కున చేర్చుకునే అనురాగం... అలసిన వేళ ఆర్తిగా దగ్గరకు తీసుకునే చేతులు... ప్రపంచంలో దేనిని గుర్తు రానివ్వకుండా చేసే వేచని కౌగిలి... కోరుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఆమెతో పాటు నడిచే పాదాలు... ఆమె విజయం సాధించినప్పుడు గర్వంగా విచ్చుకునే పెదవులు... భార్యగా తనకు బాసటగా నిలిచిన ఆమె, వ్యక్తిగా కూడా ఎదిగితే చూడాలని తపించే కళ్ళు... ఇవన్నీ వున్న మగాడు ఈ భూమి మీద వున్నాడా? వుంటే అతనికి స్త్రీగా పాదాభివందనం చేస్తాను.
నా మాటలు చదివితే మగాళ్ళకు కోపం రావచ్చు. కానీ నా మాటల మాటున దాగి వున్న ఆవేదనను చదివే ప్రయత్నం చేస్తే కోపం రాదు. ఆడది ఎన్ని సాధించినా మగాడి దగ్గర బలహీనపడుతోంది. దానికి కారణం ప్రేమ. ప్రేమ కోసం స్త్రీ పురుషుడిని ఆశ్రయిస్తుంది. తను కోరుకున్న ప్రేమ అతని దగ్గర దొరుకుతుందన్న నమ్మకంతో తన నిండు జీవితాన్ని అతని చేతుల్లో పెడుతోంది. దానిని అర్ధం చేసుకుని ఆమెను అక్కున చేర్చుకునే మగవాళ్ళు వున్నారో లేదో తెలియదు కానీ, అహంకారంతో పువ్వులాంటి ఆమె మనసును నలిపి పారేస్తున్న మగవాళ్ళు చాలామందే వున్నారు. ఇప్పటికీ ఎంతోమంది స్త్రీలు అలాంటివారి చేతుల్లో వంచనకు గురవుతూనే వున్నారు. గుండెల్లో పొంగుతున్న ఆవేదన కళ్ళనుండి బయటకు దూకకుండా, కనురెప్పల ఆనకట్ట వేసి బంధించాలని ప్రయత్నిస్తూ, భారంగా బతుకీడుస్తున్నారు. వాళ్లకు ఆ పరిస్తితి తెచ్చిన మగాళ్ళ మీద మాత్రమే నా కోపం. అంతే తప్ప నేను పురుష ద్వేషిని కాను. స్త్రీవాదిని అంతకన్నా కాదు. 

Saturday, May 15, 2010

కాదేదీ కళకు అనర్హం



ఈ ఆకృతులను చూస్తే అబ్బ ఎంత బాగున్నాయో అనిపిస్తుంది. కానీ వీటిని  ఎలా చేసారో తెలిస్తే మాత్రం ఆశ్చర్యంతో గొంతు మూగబోతుంది. కాదేదీ కవితకు అనర్హం అని శ్రీశ్రీ అంటే, కాదేదీ కళకు అనర్హం అంటాడు ఫ్రాంకోయిస్ రాబర్ట్. అందుకే ఏకంగా మనిషి ఎముకలతోనే ఇలా కళారూపాలను తయారుచేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు ఈ ఫోటోగ్రాఫర్.
          1990 లో ఒక స్కూలువారు తమ పాత ఫర్నిచర్నిఅమ్మకానికి పెట్టారు. తను ఏమయినా కొనుక్కోవాలని అక్కడకు వెళ్ళాడు రాబర్ట్. మూడు బీరువాలు కొన్నాడు. అయితే వాటిని తెరిచినపుడు షాక్ తిన్నాడు. మొదటి రెండూ ఖాళీగానే వున్నాయి కానీ మూడో బీరువాలో ఒక మానవ అస్థిపంజరం వుంది. అతడు దాన్ని తన స్టూడియోకి తీసుకెళ్ళాడు. కానీ దానితో ఏమి చేయాలో అతనికి అర్ధం కాలేదు. దాంతో అది 2007 వరకు అతని దగ్గరే ఉండిపోయింది. నిజానికి రాబర్ట్ కి మానవ అవశేషాలు అంటే ఎంతో ఆసక్తి. ఎంతో కాలంగా పుర్రెలు, ఎముకలు సేకరిస్తున్నాడు కూడా. ఒకసారి అతను ఒక ప్రాజెక్టులో భాగంగా దాదాపు అయిదు వారల పాటు మానవ అవశేషాల చిత్రాలు తీస్తూ గడిపాడు. తర్వాత అతనికి తీరిక సమయం చిక్కింది. ఏమి చేయల అని ఆలోచనలో పడ్డాడు. అప్పుడే అతనికి తన దగ్గరున్న అస్తిపంజరం గుర్తొచ్చింది. దానితో కూడా ఏమైనా చేయాలనిపించింది. అప్పట్నుంచి దానితో ఏదైనా చేయాలని గంటలు గంటలు శ్రమించాడు. ఎముకలను విడదీసి వాటిని రకరకాలుగా అమర్చసాగాడు. అతని ఆలోచనలు క్రమంగా ఒక రూపాన్ని సంతరించుకోసాగాయి. అవి ఇలా అద్భుతమయిన ఆకృతులుగా రూపం దాల్చాయి. వాటికి ఒక సార్ధకత కల్పించాలనుకున్నాడు.  హింసను వ్యతిరేకించే దిశగా అడుగులు వేసాడు. విజయం సాధించాడు. మానవ అవశేషాలతో ఇంట చక్కని ఆకృతులను చేసి, వాటి ద్వారా 'స్టాప్ వయోలెన్స్' అంటూ ఒక మంచి సందేశాన్ని ఇస్తున్న రాబర్ట్ ని ప్రసంసించకుండా ఉండగలమా? హాట్సాఫ్ రాబర్ట్!

Thursday, May 13, 2010

నీకోసం

హ్యాట్సాఫ్ స్టీవీ!

మే 13.

చరిత్రలో ఈరోజు ఎన్నో విచిత్రాలు జరిగి వుంటాయి. వింతలు చోటు చేసుకుని వుంటాయి. అద్భుతాలూ సంభవించి వుంటాయి. అవన్నీ నాకు తెలియదు కాని, 1950 లో మాత్రం ఒక అద్భుతం జరిగింది. 1950, మే 13న మిచిగాన్లో ఒక పసివాడు ప్రాణం పోసుకున్నాడు. ముద్దులొలికే ఆ చిన్నారిని అతని తల్లి తనివి తీరా చూసుకుని మురిసిపోయింది. అయితే ఆనాడు ఆ తల్లికి కూడా తెలీదు, ఒకనాడు ఈ ప్రపంచం మొత్తం తన బిడ్డను కళ్ళు విప్పార్చి చూస్తుందని. ఆ తల్లి పేరు ల్యూలా. ఆ పసివాడి పేరు స్టీవీ హార్డవే జడ్కిన్స్.

పుట్టుకే విషాదం...

కాల్విన్ జడ్కిన్స్, ల్యూలా మే హార్డవే దంపతులకు ఆరుగురు సంతానం. అందులో మూడోవాడు స్టీవీ. అందరిలా కాకుండా మూడు వారాలు ముందుగానే పుట్టటంతో అతని రూపం పూర్తిగా రూపుదిద్దుకోలేదు. ముఖ్యంగా కాళ్ళ వెనుక భాగంలో ఉండే రక్తనాళాలు సరిగ్గా వృద్ధి చెందలేదు. దాంతో అతనికి కనుచూపు కరువయ్యింది. కానీ అంధత్వం అతని కనులకే కానీ మనసుకు కాదు. అందుకే మనసుతో ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టాడు. తనకెంతో ఇష్టమైన కళకోసం కళ్ళు లేవన్న విషయాన్నివిస్మరించాడు.

స్వరమే వరమై...

చూపు ఇవ్వక దేవుడు అన్యాయం చేసినా... అద్భుతమైన స్వరాన్ని వరంగా ఇచ్చాడు. దానితోనే స్టీవీ యావత్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. చిన్ననాటి నుంచీ చర్చికి సంబంధించిన సంగీత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. పియానో, హార్మోనియం, జాజ్ తదితర సంగీత వాయిద్యాలను అలవోకగా వాయించేవాడు. అందరి ప్రశంసలనూ పొందేవాడు. అలా అతని ప్రతిభ మోటౌన్ రికార్డింగ్ కంపెనీకి చేరింది.
ఒక్కసారి అతని పాట వినగానే ఆ కంపెనీ సి.ఇ.ఒ. బెర్రీ గోర్డీ... "ఇతనిని ప్రపంచపు ఎనిమిదో వింత అని అనకుండా ఉండలేకపోతున్నాను" అన్నాడంటే, స్టీవీ ప్రతిభ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. పదమూడేళ్ల ప్రాయంలో 'ఫింగర్ టిప్స్' మ్యూజిక్ ఆల్బం... అందులో పాడటంతో పాటు పలు సంగీత పరికరాలను వాయించిన ప్రతిభాశాలిగా స్టీవీ ఒక్కసారిగా సెలెబ్రిటీ అయిపోయాడు. అందరి దృష్టీ అతనిమీద. ఏ నోట విన్నా అతని ప్రతిభే. మజిల్ బీచ్ పార్టీ, బికినీ బీచ్ ఆల్బం చేశాక అతను వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.

అవార్డులకు కేరాఫ్ అడ్రస్...

అవార్డుల కోసం స్టీవీ ఆశపడడు. కానీ అవార్డులు అతన్ని వెతుక్కుంటూ వస్తాయి. ముప్ఫై కంటే ఎక్కువ టాప్ టెన్ హిట్స్ చేసిన రికార్డు అతనిది. చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా 22 గ్రామీ అవార్డులను సొంతం చేసుకున్న ఘనత అతనిది. లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు, అకాడమీ అవార్డు, పోలార్ మ్యూజిక్ అవార్డు, మాంట్రియల్ జాజ్ ఫెస్టివల్ స్పిరిట్ అవార్డు... ఇలా చెప్పుకుంటూ పోతే అతని ప్రతిభకు గీటురాళ్ళు ఎన్నో.
మనిషిగా పుట్టినందుకు ఏదైనా సాధించాలి. మన పేరు పదిమంది చెప్పుకునేలా బతకాలి. స్టీవీని చూస్తే అది నిజమనిపిస్తుంది. వైకల్యం అతనికి విజయాన్ని దూరం చేయలేదు. కంటిచూపు లేదే అని అతను కుంగిపోతూ కూర్చోలేదు. కళకు ప్రాణం పోయాలని కలలు కన్నాడు. ఆ కలను నిజం చేసుకోటానికి అనుక్షణం శ్రమించాడు. అనుకున్నది సాధించాడు. ఆశించిన తీరాలను అందుకున్నాడు. అందుకే స్టీవీ అంటే చాలా ఇష్టం. సింగర్ గా కాదు... ఒక వ్యక్తిగా, ఒక ధీశాలిగా, ఒక ఆదర్శప్రాయుడిగా.
స్టీవీ ఒక అద్భుతం. అన్ని సదుపాయాలు ఉన్నా ఎలాంటి లక్ష్యాలూ లేకుండా సమయాన్ని వృధా చేసే సోమరులకు అతని జీవితం ఓ గుణపాఠం.
తన సంగీత తరంగాలపై యావత్ ప్రపంచాన్నీ ఓలలాడించిన స్టీవీకు జన్మదిన శుభాకాంక్షలు.

Tuesday, May 11, 2010

ఆమ్మా... నీకేమి ఇవ్వగలను?

ఈ ప్రపంచంలో వేల కట్టలేనిది ఏదయినా వుంటే అది అమ్మ ప్రేమే.
ఇంతవరకూ కల్తీ కానిది ఏదయినా వుంటే అది అమ్మ ప్రేమే.
దేనికీ అమ్ముడు పోనిది ఏదయినా వుంటే అది అమ్మ ప్రేమే.
దేని కోసమూ మనకు దూరం కానిది అమ్మ ప్రేమే. 
అమ్మంటే ప్రేమకు ప్రతిరూపం. అమ్మంటే ఆప్యాయతకు మరో రూపం. 

ప్రతిఫలం కోరనిది... ప్రతిక్షణం పరితపించేది
అనురాగం పంచేది... అనుక్షణం ఆరాటపడేది
అమ్మ మాత్రమే.
అందుకేనేమో... అవతార పురుషుడైనా అమ్మ పేగు తెంచుకునే పుడతాడు...
అమ్మ ప్రేమ పంచుకునే అంతవాడు అవుతాడు అన్నాడో మహాకవి.

 నిజమే కదా!
అమ్మ కడుపులో తొమ్మిది నెలల పాటు ఊపిరి పోసుకుంటాం.
అమ్మ ఒడిలో పసితనమంతా సేద తీరుతాం.
అమ్మ గుండెల్లో బతుకంతా తల దాచుకుంటాం.
అమ్మ నేర్పిన మొదటి అడుగును ఆసరాగా చేసుకుని ఎంతటి ఎత్తుకయినా ఎదుగుతాం.
అమ్మ తెలిపిన జ్ఞానాన్ని అనుసరించి ఎంతటి ఘన కీర్తినయినా గర్వంగా మూట కట్టుకుంటాం.
తినటం నేర్పింది అమ్మ. తెలివిగా బతకటం నేర్పింది అమ్మ.
అడుగేయటం నేర్పింది అమ్మ. అడుగడుగునా అండగా నిలిచేది అమ్మ.
అమ్మ లేని ప్రపంచం లేదు. అమ్మ లేకుండా ప్రపంచంలో మన మనుగడ సాగదు.

అమ్మ గురించి మాట్లాడినప్పుడల్లా నాకో కధ గుర్తొస్తుంది.

ఒక పిల్లాడు రాత్రి పడుకోబోయేముందు తన తల్లి దగ్గరకు వచ్చి ఒక కాగితాన్ని చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. అందులో ఇలా రాసి వుంది.
గడ్డి కోసినందుకు... 5 /-
ఇల్లు క్లీన్ చేసినందుకు... 10 /-
కిరాణా సామాను తెచినందుకు... 10 /-
చెత్త పారబోసినందుకు... 5 /-
చెల్లిని ఆడించినందుకు... 5 /-
మొత్తంగా నువ్వు నాకు బాకీ వున్నది... 35 /-

తర్వాత రోజు ఉదయం లేవగానే తల్లి తన కొడుకు చేతిలో ఒక కాగితాన్ని పెట్టింది. అందులో ఇలా వుంది.

నిన్ను తొమ్మిది నెలలు మోసినందుకు... వెల లేదు
నీకు జన్మనిచినందుకు... వెల లేదు
నీకు అన్నం తినిపించినందుకు... వెల లేదు
నువ్వు మరుగుకు వెళ్తే శుభ్రం చేసినందుకు... వెల లేదు
నీకు బట్టలు, చాక్లెట్లు, బొమ్మలు కొనిచినందుకు... వెల లేదు
నువ్వు జబ్బు పడితే సేవ చేసినందుకు... వెల లేదు

మొత్తంగా నువ్వు నాకు చెల్లించాల్సింది ఏమీ లేదు.

ఇది చదివేసరికి ఆ పిల్లాడి కళ్ళలో నీళ్ళు నిండిపోయాయి. ఏడుస్తూ వెళ్లి తల్లి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు...
"నువ్వు నాకేమి ఇవ్వక్కర్లేదమ్మా. నేనే నీకు బాకీ పడ్డాను. చాలా చాలా బాకీ పడ్డాను"

ఈ కధ గుర్తొస్తే నా మనసు భారమై పోతుంది. నిజమే కదా! ఏమి ఇచ్చి తల్లి ఋణం తీర్చుకోగలం!
  జన్మనిచ్చి, సేవచేసి, బుద్ధులు నేర్పి, ఇంతవాళ్ళను చేసిన అమ్మకు ఏమి ఇవ్వగలం?

ఇవ్వగలం. చాలా ఇవ్వగలం.

ఆమె ముసలిది అయిపోయి ఆశ్రయం కోరి వచ్చినపుడు మన ఇంట్లో తన కోసం ఒక గదిని కేటాయించలేమా?
ఆకలిగా వుందని అని ఆమె నోరు తెరచి అడిగేలోపే పట్టెడు ముద్దను ఆమెకు పెట్టలేమా?
కళ్ళజోడు పాతదై పోయిందని చెప్పేలోపే కొత్త కళ్ళజోడును కొనివ్వలేమా?
ముసలిదానికి ముచ్చటలు ఎందుకని ముతక చీర ముఖాన కొట్టకుండా... తనకు నచ్చిన రండు చీర తెచ్చి ఇవ్వలేమా?
పళ్ళు లేనిదానికి పసందులేమిట్లే అని సనుక్కోకుండా... ఆమెకెంతో ఇష్టమైన పాయసాన్ని చేసి తినిపించలేమా?
తనకు నచ్చిన భక్తి చానల్ చూస్తున్నపుడు క్రికెట్ కోసమో, చిరంజీవి సినిమా కోసమో చానల్ మార్చకుండా వుండలేమా?
సమయం లేదని వంకలు చెప్పకుండా, బిజీ అంటూ బడాయిలు పోకుండా రోజూ పడి నిముషాలు ఆమెతో కబుర్లు చెప్పలేమా?

చేయగలం. ఇవన్ని తనకోసం మనం చేయగలం. ఇంతకుమించి ఏవేవో చేయాలని తను మనలను కోరదు కూడా. ఒకవేళ కోరితే వాటిని తీర్చటం కోసం తన బిడ్డ ఎంత కష్టపడి పోతాడోనని ఆ మాతృ హృదయం ముందుగానే బెంగపడిపోతుంది. అందుకే అంతకు మించి ఏదీ ఆశించదు.

మనకోసం బతికినా అమ్మకి, మనం తప్ప వేరే ప్రపంచమే లేదనుకునే పిచ్చి తల్లికి, మనకోసం ఎన్నో కష్టనష్టాలకోర్చిన మాతృమూర్తికి మనం చేయగలిగింది కూడా చేయలేకపోతే మన జన్మ వృధా! అందుకే మాత్రుదినోత్సవాలు చేసుకోవటం కాదు, అమ్మ మనసు తెలుసుకుని నడచుకోవటం అలవాటు చేసుకోవాలి. అమ్మ మనకోసం చేసిన త్యాగాలను మరువకుండా మననం చేసుకోవాలి.
దానికి ప్రతిగా మనమేమి తన కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు.
మనకు జన్మనిచ్చిన ఆ తల్లి పేగు బాధతో మెలికలు పడకుండా చూసుకుంటే చాలు.
బయటకు వెళ్ళిన మనం ఇంటికొచ్చే వరకు కళ్ళలో వొత్తులు వేసుకుని చూసిన ఆమె కళ్ళలో కన్నీటి తడి చేరకుండా చూసుకుంటే చాలు.
మనకు అన్నీ అమర్చి పెట్టటం కోసం పరుగులిడి అలసిన ఆమె పాదాలు పట్టు తప్పుతుంటే, కింద పడకుండా ఆమెను పొదివి పట్టుకుంటే చాలు.

ఇవి చాలు... ఆ తల్లి మనసు మురిసిపోతుంది. మరు జన్మలో సైతం మనల్ని తన కడుపున మోయాలని కలలు కంటూ ప్రసాంతంగా కన్ను మూస్తుంది.

ఇంతకన్నా అమ్మకు మనం ఏమి చేయగలం?
ఇంతకుమించి ఆ ప్రేమమయికి ఏమి ఇవ్వగలం?





Friday, May 7, 2010

నేడు టాగూర్ జయంతి

Tuesday, May 4, 2010

మంచి సినిమా.. మంచిని తెలిపిన సినిమా..!

ఆ మధ్య సినిమా చూద్దామని వెళ్ళాను. షాక్ తిన్నాను. ఎందుకంటే చూడటానికి అక్కడ ఒక్క సినిమా కూడా లేదు. అన్నీ హిందీ, ఇంగ్లిష్ సినిమాలే. విసుగేసి వేరే చోటికి వెళ్ళాను. అక్కడా ఇదే పరిస్తితి. చాలా బాధ వేసింది. చూద్దామంటే సినిమా లేని దౌర్భాగ్యపు స్తితిలో తెలుగు ప్రేక్షకుడు వున్నందుకు సిగ్గు వేసింది. ఏమి చేయాలో అర్ధం కాక సీడీ షాప్ కి వెళ్ళి, రెండు సీడీలు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రెండు సీడీల్లో ఒకటి... గ్రహణం.
నిజంగా చాల గొప్ప సినిమా. మూఢ నమ్మకాలు మనిషిని ఎంతకు దిగాజార్చుతాయో, వాటి వల్ల అమాయకుల జీవితాలు ఎలా అస్తవ్యస్తమవుతాయో తెల్పుతూ ప్రముఖ రచయిత చలం రాసిన కథ 'దోషగుణం'. దాని ఆధారంగా ఈ సినిమా తీసారు. ఒక చిన్న కథని సినిమాగా తీయాలంటే ఎంతో కష్టం. మూల కథ చెడకుండా జాగ్రత్తగా చూపించాలి. లేకపోతే మూల కధ లోని అసలు భావం చెడిపోతుంది. అలా చెడకుండా సినిమా తీయాలంటే ఎంతో ఆలోచన, శ్రమ కావాలి. ఆ విషయంలో ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రతిభని కొనియాడి తీరాలి.


ఇక కధలోకి వెళ్తే, ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న ఒక రోగి “తల్లినం”టూ వచ్చిన స్త్రీని దుర్భాషలాడి బయటకి పంపేయడం చూసిన ఓ డాక్టర్ ఆమెను అనుసరిస్తాడు. వివరాలు కనుక్కొందామని ఆరా తీసేసరికి ఆమె కంగారుగా వెళ్లిపోతుంది. వెంటనే ఆసుపత్రిలో ఉన్నవారిని ఆమె గురించి ఆరా తీస్తే కొద్దిపాటి సమాచారం తెలుస్తుంది. ఇంటికి వచ్చిన తన స్నేహితునితో ఓ కథ చెప్పటం మొదలెడతాడు. అతను పుట్టి పెరిగిన ఊర్లో నారాయణస్వామి అనే భూస్వామి ఉండేవాడు. అతని భార్య శారదాంబ అందగత్తె. అత్తగారినీ, భర్తనీ, ఆస్తిపాస్తుల్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. కటిక పేదకుటుంబానికి చెందిన కనకయ్య అనే అబ్బాయి వాళ్ళ ఇంట్లో వారాలకి కుదురుతాడు. తెలివైన ఆ కుర్రాడంటే భూస్వామికీ, అతడి భార్యకీ కూడా చాలా ఇష్టం! అయితే ఉన్నట్టుండి ఆ కుర్రాడు జబ్బు పడతాడు. ఊర్లో ఉన్న వైద్యునికి చూపిస్తారు. గుణం కనిపించకపోగా, జబ్బు ముదురుతుంది. తల్లిదండ్రులు కంగారుపడి ఒక మంత్రగాడికి చూపిస్తారు. “వచ్చింది మామూలు జ్వరం కాదు, దోషగుణం. తనకన్నా వయస్సులో పెద్దదైన స్త్రీతో కలవడం వల్ల ఈ జబ్బు వచ్చింది. ఆమె రక్తంతో చేసిన మందు కంటిలో పెడితే నయం అవుతుంది” అని చెప్తాడు. ఇది విన్న కుటుంబ సభ్యులు అవాక్కవుతారు. నిద్రలో కుర్రాడు శారదాంబ పేరు పలవరిస్తాడు.  పిల్లాడి జబ్బుకు కారణం ఆమేనని నిర్ధారణకు వస్తారు కనకయ్య కుటుంబ సభ్యులు. జబ్బు ముదురుతుంది. భూస్వామికి కూడా తన భార్య మీద అనుమానం కలుగుతుంది. దాంతో ఆమె మీద నింద మోపుతారు. నారయణస్వామి కూడా ఆ నిందను నమ్ముతాడు. తిరగబడిన భార్యను కొడతాడు. ఆమె రక్తం తీసి ఇస్తాడు. ఊహించని విధంగా పిల్లాడి జబ్బు నయమవుతుంది. దాంతో శారదంబ మీద వేసిన నింద నిజమవుతుంది. ఆమెను ఇంటినుంచి గెంటేస్తాడు భర్త. అప్పటి ఆ కనకయ్యే ఈ డాక్టర్. ఈ కధంతా చెప్పి ఆమె కోసం వెతుకుతాడు. కాని ఆమె మళ్ళీ కనిపించదు. అతడు ఆమె కోసం ఎదురు చూస్తున్నట్టుగా చూపించి సినిమా ముగించాడు డైరెక్టర్.


తనికెళ్ళ భరణి నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన తరహాలో నారాయణ స్వామి పాత్రను అద్భుతంగా పండించారు. ఇక శారదాంబ పాత్రలో జయలలిత నటన గురించి చెప్పుకోవాలి. వ్యాంప్ పాత్రలు వేసే ఆ జయలలితేనా ఈమె అనిపించింది. ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయిందామె. కనకయ్య గా మోహనీష్ బాగా చేసాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.


చిన్న చిన్న సంభాషణలతో, చక్కని స్క్రీన్ణ్ ప్లేతో ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు. అక్కర్లేని సంభాషణలు, పనికిరాని దృశ్యాలు లేవు. ముఖ్యంగా ముగింపు అద్భుతం. ఊహించని విధంగా సినిమాను ముగించారు.  విజయ్ సంగీతం కూడా చాలా బాగుంది. పాటలు లేవు కాని సన్నివేశాలకు బలాన్ని చేకూర్చింది ఆయన సంగీతం.


ఒక్క మాటలో చెప్పాలంటే మూఢ నమ్మకాల చీకట్లో మగ్గిపోతున్న వారికి ఈ చిత్రం ఒక మంచి గుణపాఠం. చలం కధ నేను చదవలేదు కాని ఈ సినిమా చూసి చాలా వుద్విగ్నతకు లోనయ్యాను. ఒక చక్కని సందేశాన్ని ఆసక్తికరంగా అందించారు. సున్నితమయిన బంధాలను జాగ్రత్తగా కాపాడుకోకపోతే పరిస్తితులు ఎలా మారతాయో అందంగా చూపించారు. అదే ఈ సినిమాకు అవార్డులను తెచ్చి పెట్టింది. ఇలాంటి ఒక చక్కని సందేశాత్మక చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన మోహనకృష్ణ అభినందనీయుడు.


ఏదేమైనా చాలా కాలం తరువాత ఒక మంచి సినిమాను చూసే భాగ్యాన్ని కలిగించిన గ్రహణం యూనిట్ కు మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా!

Monday, May 3, 2010

నాకు తెలిసిన కొన్ని నిజాలు!

కొన్ని విషయాలు మనకు తెలిసినట్టే వుంటాయి. కాని సంపూర్ణంగా తెలియదు. తెలిసినప్పుడు అవునా అని ఆశ్చర్యం కలగకా మానదు. నాకు తెలిసిన అలాంటి కొన్ని నిజాలు ఇవి. బహుశా మీకు కూడా తెలిసే వుంటాయి. అయినా ఒకసారి చూడండి.

* మనది ఎడమ చేతి రాత అయితే మనం ఆహారాన్ని ఎడమ వైపునే నములుతాం. అదే కుడి చేతి రాత అయితే కుడి పక్కన నములుతాం.

*  ఉల్లిపాయలు కోసేటప్పుడు చూయింగ్ గమ్ నములుతూ వుంటే కళ్ళు మండవు.

* పొగ తాగేవారికి మామూలు వ్యక్తులతో పోలిస్తే ఒక గంట ఎక్కువ నిద్ర అవసరం.

* నవ్వు అరోగ్యానికి చాలా అవసరం. ఒత్తిడిని తగ్గించి, కండరాలను అరోగ్యంగా వుంచటంలో నవ్వు ప్రముఖ పాత్ర వహిస్తుందని వైద్యులు ధ్రువీకరించారు. అయితే పెద్దవారితో పొలిస్తే చిన్న పిల్లలే ఎక్కువగా నవ్వుతారట! ఆరేళ్ళ బిడ్డ రోజుకు దాదాపు 300 సార్లు నవ్వితే, పెద్దవాళ్ళు కేవలం 15 నుంచి 100 సార్లు మాత్రమే నవ్వుతారట!

* కుక్కల్లో డాల్మేషన్స్ ని చాలామంది ఇష్టపడతారు. అయితే వాటి ఒంటి మీద వుండే నల్లని చుక్కలు పుట్టుకతో రావని చాలామందికి తెలియదు.

* మగవాళ్ళ చొక్కాలకు కుడి వైపున, ఆడవాళ్ళ చొక్కాలకు ఎడమ వైపున గుండీలు వుంటాయని ఎప్పుడైనా గమనించారా?

* మనం తుమ్మే ప్రతిసారీ మన మెదడులోని కొన్ని నాడులు చనిపోతాయట

* కోళ్ళు తమ మెడను సాగదీయకుండా కూయలేవు.

* ఖడ్గమ్రుగం తెలుసుగా? అది దిగులుగా వున్నపుడు దాని చెమట ఎర్రగా మారిపోతుంది.

* టైటానిక్ షిప్ మళ్ళీ నిర్మించాలంటే 7 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది. కాని టైటానిక్ సినిమా తీయాలంటే మాత్రం 200 మిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయట!

* ఈఫిల్ టవర్ పై అంతస్తుకి చేరుకోటానికి 1,792 మెట్లు ఎక్కాలట!

* మన శరీరంలో రక్త సరఫరా వుండని ఏకైక అవయవం కార్నియా. అది ఆక్సిజన్ ని డైరెక్ట్ గా గాలి నుంచి తీసుకుంటుంది.

* తలను వెనక్కి తిప్పకుండా వెనుక ఏం జరుగుతుందో చూడగల జంతువులు రెండే రెండు. ఒకటి కుందేలు, రెండోది రామచిలుక.

* బొద్దింక తలను కట్ చెసినా అది కొన్ని వారాల వరకూ బతికే వుంటుంది.

* ఫిబ్రవరి 1865... ఈ నెలకి చరిత్రలో ఒక ప్రాధాన్యత వుంది. అదేమిటంటే, అసలు పౌర్ణమి అంటూ లేని నెల అది. ఆ నెలలో అసలు పూర్ణ చంద్రుడు కనిపించలేదంట!

ఇప్పటికి ఇవి చాల్లెండి. మరోసారి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.

పసి మనసులతో 'ఆట' ఎందుకు?

ఒక్కసారి ఒకటి నమ్మితే ప్రాణం పోయినా అభిప్రాయం మార్చుకోని వాళ్ళు చాలామంది వుంటారు. తాము నమ్మే పిచ్చినే వేదం అనుకునే వెర్రివాళ్ళూ వుంటారు. కాని అది మంచిది కాదని ప్రపంచమంతా కోడై కూస్తున్నాకాదని వాదించే వాళ్ళను ఏమనాలో వాళ్ళనే అడగాలి. వాళ్ళు ఎవరో కాదు... ఆట పేరెంట్స్. ఒక పక్క మానవ హక్కుల సంఘం, మరో పక్క సేవాసంఘాలు మీ పిల్లలకు ప్రమాదం అని హెచ్హరిస్తున్నావినకుండా మొండిగా వాదించటం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది.

పిల్లలతో పిచ్చి పిచ్చి దుస్తులు వేయించటం, పెద్దవాళ్ళ తరహాలో హావ భావాలను పలికేలా చేయటం వాళ్ళ మానసిక ప్రవ్రుతిని దెబ్బ తీస్తుందని మానసిక తత్వవేత్తలు గోల పెడుతుంటే, మా పిల్లల గురించి మాకు తెలుసంటూ అడ్డంగా వాదించటం చాలా వింతగా వుంది. పిల్లల గురించి వారికి తెలియదనో, పిల్లల మీద ప్రేమలేదనో కాదు చెప్పింది. మీకు తెలియకుండానే మీ పిల్లలకు హాని చేస్తున్నారని గుర్తు చేయాలని ప్రయత్నిచింది మానవ హక్కుల కమిషన్. అది అర్ధం చేసుకోకుండా వాదించటం హాస్యాస్పదం.ఈ విషయం గురించి చర్చించటానికి టీవీ చానల్ వాళ్ళు పిలిస్తే ఆ పిల్లల తల్లులు, మెంటర్ చేసిన రభస అంతా ఇంతా కాదు. మర్యాదలు పాటించకపోవటం అటుంచి, సమస్య గురించి మాత్లాడుతున్న సామాజిక సేవా కార్యకర్తని హేళన చేయటం అమానుషం. ఇలాంటి ప్రవర్తనను ఎవరూ ప్రోత్సహించకూడదు. ఛానల్ వారు దీనిని వెంటనే ఖండించి వుండాల్సింది.

పిల్లల టాలెంట్ వెలుగు చూడటానికి ఆ ప్రోగ్రాం మంచి వేదికే. దాన్ని ఎవరూ కాదనరు. కాని మిగిలిన విషయాలు కూడ ఆలోచించాలి కదా! చిన్నారుల ఆహార్యం దగ్గరనుంచి అసభ్య నృత్య భంగిమలు, హావభావాలతో వాళ్ళు గెంతులు వేస్తుంటే, జడ్జిలు, మెంటర్లు చప్పట్లు కొట్టటం చూస్తే వొళ్ళు మండిపోతుంది. అది చాలదన్నట్లు తీవ్రమైన వాగ్వాదాలు, వయసుకు మించిన చాలెంజ్ లు చూస్తూంటే అసహ్యమేస్తుంది. హాయిగా చదువుకొని,నవ్వుకుంటూ ఎదగాల్సిన బాల్యం డాన్స్ మాస్టర్ల కౄర శిక్షణకు బలైపొతోంది. వారి బాల్యంతో చెలగాటమాడుతున్న యిటువంటి రియాల్టే షోలను ప్రసారం చేయకుండా వుండాల్సిన బాధ్యత టీవీ చానెళ్ళకు ఎంతైనా వుంది. ఆ బాధ్యత మర్చిపోయిన చానెళ్ళపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
డాన్సు నేర్చుకోవడాన్ని ఎవరూ కాదనరు. కాని డాన్సు పేరుతో పిల్లల మీద ఇంతటి ఒత్తిడిని కలిగించటం ఎంతవరకూ సమంజసమో తల్లిదండ్రులు అలోచించి తీరాలి. వాళ్ళ బంగారు భవితను ఇలాంటి షోల పాలు కాకుండా జాగ్రత్త పడాలి. పిల్లలకు వారి బాల్యాన్ని ఆనందించే అవకాశాన్ని కల్పించాలి. అలా కల్పించటం తమ బాధ్యతని ప్రతి తల్లి, తండ్రి గుర్తించాలి. అలా గుర్తించని తల్లిదండ్రులను కఠినంగా శిక్షిస్తేనే తప్ప, పసివారి పండంటి జీవితాలతో ఆటలాదుతున్న ఇలాంటి షోలు, చానెళ్ళ ఆగడాలకు అంతం వుండదు.

Sunday, May 2, 2010

వేసవిలో చల్లగా ...!

వేసవి కాలం వచ్చిందంటే ఎండల వేడినుంచి తప్పుకోవడానికి, రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయినాకూడా చాలావరకు ఎండవేడిమి బారిన పడుకుండామాత్రం ఉండలేం. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే తప్పక ఫలితం ఉంటుంది.

* చెమటతో ఇబ్బంది పడుతుంటే స్నానం చేసేటప్పుడు నీటిలో గులాబీ రేకులను వేసి స్నానం చేయండి. రోజంతా తాజాగా ఉన్న ఆనందం కలుగుతుంది.


* ఎండాకాలంలో బయటకు వెళ్ళే ముందు మీ కళ్ళ అద్దాలు ధరించండి. వీలైతే కళ్ళకు ఐ ప్రొటెక్టివ్ క్రీమ్ వాడండి.


* మేకప్ వేసుకునే వారు ప్రత్యేకంగా వేసవి కాలంలో కళ్ళకు తేలికపాటి మేకప్ చేయండి.

* ఎండకు తిరిగి తిరిగి ఇంట్లోకి వచ్చిన తర్వాత రోజ్ వాటర్‌లో తడిపిన దూదిని కళ్ళపై ఐదు నిమిషాలపాటుంచండి. దీంతో కళ్ళకు మంచి విశ్రాంతి కలుగుతుంది. చూపు చాలా బాగుంటుంది.


* రోజ్ వాటర్ దొరకని సమయంలో శుభ్రమైన గుడ్డను నీటిలో ముంచి కళ్ళపై ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. కళ్ళ మంట తగ్గుతుంది.


* వేసవి కాలంలో ఎక్కువగా బయట తిరిగే వారు తరచూ చల్లటి నీటితో ముఖాన్ని, కళ్ళను శుభ్రపరుస్తుండండి.

* కళ్ళు మంటగా అనిపిస్తే కీరకాయ ముక్కలు లేదా మంచు ముక్కలు(ఐస్ క్యూబ్స్) కళ్ళపై ఉంచండి. దీంతో కళ్ళకు ఉపశమనం కలుగుతుంది.

* అలసట, దప్పిక, చికాకు తదితరాలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇలాంటి సమయంలో పుదినా ఆకుల పొడి ఒక చెంచా, అరచెంచా యాలకుల పొడిని ఓ గ్లాసు నీటిలో కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.

ఆహారం - జాగ్రత్తలు

* మండు వేసవిలో పరిశుభ్రమైన శాకాహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మసాలాలు, మాంసాహారానికి దూరంగా ఉండాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం ఉత్తమం. అలాగే శరీరానికి చల్లదనం ఇచ్చే అన్నిరకాల పండ్లను సాధ్యమైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఐస్ తక్కువగా వేసుకుని పండ్ల రసాలను కూడా ఎక్కువగా సేవించవచ్చు. సహజ సిద్ధమైన పోషక విలువలు ఉండే పండ్లను తిన్నట్లయితే.. శరీరాన్ని సమస్థితిలో ఉంచటమేగాక దాహార్తిని తీర్చి శరీరానికి స్వాంతననిస్తాయి.



* పండ్లలో పుచ్చకాయను తినటంవల్ల శరీరానికి ఎంతగానో మేలు జరుగుతుంది. రుచితోపాటు బీ విటమిన్ అధికంగా ఉండే పుచ్చకాయ శరీరానికి శక్తినివ్వటమేగాక.. అందులో ఉండే పొటాషియం గుండెకు ఎంతగానో మేలు చేస్తుంది. వడదెబ్బ బారినుంచి కాపాడుతుంది. ఎండ తీవ్రతకు కమిలిపోయిన చర్మానికి స్వాంతననిస్తుంది. రక్తపోటును అరికడుతుంది. అలాగే పోషకవిలువలు ఎక్కువగా ఉండే కీర దోసను కూడా ఎక్కువగా తీసుకోవాలి.

* కొబ్బరి నీళ్లను కూడా వేసవిలో ఎక్కువగా తాగాలి. ఇందులోని ఖనిజ లవణాలు వేసవి నుంచి శరీరాన్ని చల్లబరుస్తాయి. దీంతో పాటు శరీరాన్ని తక్షణ శక్తి అందిస్తుంది. వేసవి తాపం నుంచి శరీరాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సాధ్యమైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలి. అలాగే చెరకు రసాన్ని కూడా తీసుకోవాలి. ఈ రసంలో కార్బోహైడ్రేట్లు అపారంగా ఉంటాయి. దీంతో తక్షణ ఉపశమనం లభిస్తుంది. మూత్ర సంబంధ వ్యాధులతో బాధపడేవారు చెరకు రసం తీసుకుంటే చాలా మంచిది. వేసవిలో ఎప్పటికప్పుడు మజ్జిగలో నిమ్మరసం కలుపుకుని తాగితే చాలా మంచిది.