Wednesday, September 29, 2010

నా లిస్టులో చేరిన మరో మంచి సినిమా!


దాసరి నారాయణరావు...  నా నా అభిమాన దర్శకుడు అని చెప్పేస్తే సరిపోదు. ఎందుకంటే నాలాంటి అభిమానులు వందల్లో, వేళల్లో వుంటారు. అద్భుతమైన సినిమాలను సృష్టించిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. బలిపీఠం, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి,  మేఘసందేశం, ప్రేమాభిషేకం, శివరంజని... ఒకటా రెండా.. చెప్పుకుంటూ పోతే లెక్క తెగనన్ని చిత్ర రాజాలు మన కళ్ళముందు ఠీవిగా వచ్చి నిలబడతాయి. అలాంటి ఒక చిత్రాన్ని ఈరోజు ఉదయం తేజ టీవిలో చూసాను. అదే ధర్మపీఠం దద్దరిల్లింది. శోభన్ బాబు, జయసుధ, కైకాల సత్యనారాయణ తదితరులు నటించిన ఈ చిత్రం.. దర్శకరత్నమన తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన మరో మంచి చిత్రం.
                మామూలుగానే శోభన్ బాబు అంటే పడి చచ్చే నేను, ఈ సినిమాలో ఆయన నటన చూసి రెప్ప వేయటం కూడా మర్చిపోయాను. ఆ ఠీవి, ఆ నడక, ఆ డైలాగ్ డెలివరీ... ఓహ్.. ఆ పాత్రలో ఆయన జీవించారు. తన బిడ్డలను దేశానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలనే వున్నతమైన ఆలోచనతో ఒకడిని డాక్టర్ని, ఒకడిని ఇంజినీర్ని, ఒకడిని లాయర్ని చేస్తాడు తండ్రి. కానీ వాళ్ళు అవినీతికి కొమ్ము కాసేవాళ్ళుగా, లంచాలకు న్యాయాన్ని తాకట్టు పెట్టేవాల్లుగా తయారవుతారు. ఒక కొడుకు చేసిన దుర్మార్గాన్ని చూసిన తల్లి దానిని బయటపెట్టబోతున్న తల్లిని, ముగ్గురు కొడుకులూ కలిసి  పిచ్చిదానిలా చిత్రీకరిస్తారు. ఒక సమయంలో భర్తకు నిజం చెప్పి కన్ను మూస్తుంది ఆమె. సాయం చేయమని వచ్చిన తన స్నేహితునికి సైతం డబ్బుకు ఆశపడి తన కొడుకులు అన్యాయం చేయడాన్ని జీర్నిన్చుకోలేకపోతాడు తండ్రి. వాళ్ళు బతికుంటే సమాజాన్ని నాశనం చేస్తారన్న ఉద్దేశంతో తన ముగ్గురు కొడుకుల్నీ చంపేస్తాడు. న్యాయస్థానం అతనికి ఉరిశిక్షను విధించగానే, కోర్టులోనే కుప్పకూలిపోతాడు.
             కధ ఆసాంతం ఆసక్తికరంగా సాగుతుంది. అందరూ ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేసారు. అయితే శోభన్ నటన మాత్రం అద్వితీయం. ముఖ్యంగా క్లైమాక్స్లోని  కోర్టు సీన్లో ఆయన హావభావాలు, డైలాగ్స్ చెప్పేటప్పుడు ఖంగుమనే స్వరం అమేజింగ్. శోభన్ బాబు సినిమా కదా అని చూడటం మొదలుపెట్టాను కానీ, ఆ కధ, కధన శైలి నన్ను కదలనివ్వలేదు. హాట్సాఫ్ టు దాసరి అండ్ శోభన్ బాబు!

న్యాయం గెలిచిందా ఓడిందా?

సుదీర్ఘ విచారణలు, వివాదాల తరువాత ఆయేషా మీరా హత్య కేసులో తీర్పు వెలువడింది. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడింది. అయితే శిక్ష పడింది నేరం చేసినవాడికేనా? చేసాడని అనుకుంటున్న వాడికా?


       ఆ రోజు ఉదయం పేపర్లో ఆయేషా హత్య గురించి చదివి నేను కదలిపోయాను. మనుషుల్లో ఇంత పైశాచికత్వం, ఇంత రాక్షసత్వం ఉంటాయా అని హడాలిపోయాను. అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని ఇంత క్రూరంగా చంపిన మానవ మృగాన్ని ఏమి చేసినా పాపం లేదని అనుకున్నాను. కాని నేను కోరుకున్నట్టు వాడిని ఎవరూ ఏమీ చేయలేదు. ఒక పసిమొగ్గ రాలిపోయింది. ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఒక కన్నతల్లి కన్నీరు ఏరయ్యింది. ఆమెకు ఎవరూ ఓదార్పు కలిగించలేదు. న్యాయం చేయలేదు. సాక్ష్యాలు తారుమారయ్యాయి. వాస్తవాలు మారిపోయాయి. 
          ఆయేషా హత్య జరిగిన రోజు ఆమె ఉంటున్న హాస్టల్ ఎదురుగా ఉన్న టీ కొట్టులో టీ తాగుతూ, హాస్టల్ వద్దనే సత్యంబాబు తచ్చాడటం ఒక వ్యక్తి చూశాడు. అంతకుమించిన ప్రత్యక్ష ఆధారాలు లేవు. అయినా అతన్ని అరెస్ట్ చేసారు. రకరకాలుగా విచారణ చేసారు. అతను నేరాన్ని అంగీకరించాడు. ఇప్పుడు శిక్షకీ తల వంచాడు. కానీ అతడు నేరస్తుడు కాదని, అసలు నేరస్తులు వేరే వున్నారని ఆయేషా తల్లి బల్ల గుద్ది చెప్పారు. మరి ఆ మాటలను ఎవరూ ఎందుకు పట్టించుకోలేదో, కనీసం హాస్టల్ వార్డెన్ని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ అర్ధం కాని, సమాధానం దొరకని ప్రశ్నలే. అయితే ఈ ప్రశ్నలు తీర్పు ఇచ్చే జడ్గి మనసులో రేకేత్తకపోతయా, వాళ్ళని కూడా హాజరుపరచమని ఆదేశాలు ఇవ్వకపోతాడా అని చివరి క్షణం వరకూ ఆశగా చూసాను. కాని నేనూ అనుకున్నది జరగలేదు.  అనుమానాలు నివృత్తి కానేలేదు. కేసు మాత్రం పూర్తయింది. న్యాయమే గెలిచిందో అన్యాయమో గెలిచిందో తెలియదు కానీ ఆయేషా హత్యోదంతానికి శాశ్వతంగా తెర పడింది.
          ఎందుకో తెలియదు కాని, ఈ తీర్పు నాకు సంతృప్తిని కలిగించలేదు. సత్యం అసలు నేరస్తుడు కాదని అందరిలాగే నేనూ నమ్మటం వల్లనా లేక ఒక అమాయక ఆడపిల్లను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న క్రూరునికి ఆ శిక్ష సరిపోదనా? ఏమో... ఏమీ తెలియటం లేదు. ఒకటి మాత్రం అనిపిస్తోంది. ఈ సమాజంలో ఆడపిల్లకు ఇప్పటికీ రక్షణ కరువే... పేదవాడికి ఎప్పటికి న్యాయం కరువే.