Wednesday, September 29, 2010

న్యాయం గెలిచిందా ఓడిందా?

సుదీర్ఘ విచారణలు, వివాదాల తరువాత ఆయేషా మీరా హత్య కేసులో తీర్పు వెలువడింది. నిందితుడికి యావజ్జీవ శిక్ష పడింది. అయితే శిక్ష పడింది నేరం చేసినవాడికేనా? చేసాడని అనుకుంటున్న వాడికా?


       ఆ రోజు ఉదయం పేపర్లో ఆయేషా హత్య గురించి చదివి నేను కదలిపోయాను. మనుషుల్లో ఇంత పైశాచికత్వం, ఇంత రాక్షసత్వం ఉంటాయా అని హడాలిపోయాను. అభం శుభం తెలియని ఒక ఆడపిల్లని ఇంత క్రూరంగా చంపిన మానవ మృగాన్ని ఏమి చేసినా పాపం లేదని అనుకున్నాను. కాని నేను కోరుకున్నట్టు వాడిని ఎవరూ ఏమీ చేయలేదు. ఒక పసిమొగ్గ రాలిపోయింది. ఎవరూ పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఒక కన్నతల్లి కన్నీరు ఏరయ్యింది. ఆమెకు ఎవరూ ఓదార్పు కలిగించలేదు. న్యాయం చేయలేదు. సాక్ష్యాలు తారుమారయ్యాయి. వాస్తవాలు మారిపోయాయి. 
          ఆయేషా హత్య జరిగిన రోజు ఆమె ఉంటున్న హాస్టల్ ఎదురుగా ఉన్న టీ కొట్టులో టీ తాగుతూ, హాస్టల్ వద్దనే సత్యంబాబు తచ్చాడటం ఒక వ్యక్తి చూశాడు. అంతకుమించిన ప్రత్యక్ష ఆధారాలు లేవు. అయినా అతన్ని అరెస్ట్ చేసారు. రకరకాలుగా విచారణ చేసారు. అతను నేరాన్ని అంగీకరించాడు. ఇప్పుడు శిక్షకీ తల వంచాడు. కానీ అతడు నేరస్తుడు కాదని, అసలు నేరస్తులు వేరే వున్నారని ఆయేషా తల్లి బల్ల గుద్ది చెప్పారు. మరి ఆ మాటలను ఎవరూ ఎందుకు పట్టించుకోలేదో, కనీసం హాస్టల్ వార్డెన్ని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదో ఎవరికీ తెలియదు. ఇప్పటికీ అర్ధం కాని, సమాధానం దొరకని ప్రశ్నలే. అయితే ఈ ప్రశ్నలు తీర్పు ఇచ్చే జడ్గి మనసులో రేకేత్తకపోతయా, వాళ్ళని కూడా హాజరుపరచమని ఆదేశాలు ఇవ్వకపోతాడా అని చివరి క్షణం వరకూ ఆశగా చూసాను. కాని నేనూ అనుకున్నది జరగలేదు.  అనుమానాలు నివృత్తి కానేలేదు. కేసు మాత్రం పూర్తయింది. న్యాయమే గెలిచిందో అన్యాయమో గెలిచిందో తెలియదు కానీ ఆయేషా హత్యోదంతానికి శాశ్వతంగా తెర పడింది.
          ఎందుకో తెలియదు కాని, ఈ తీర్పు నాకు సంతృప్తిని కలిగించలేదు. సత్యం అసలు నేరస్తుడు కాదని అందరిలాగే నేనూ నమ్మటం వల్లనా లేక ఒక అమాయక ఆడపిల్లను నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న క్రూరునికి ఆ శిక్ష సరిపోదనా? ఏమో... ఏమీ తెలియటం లేదు. ఒకటి మాత్రం అనిపిస్తోంది. ఈ సమాజంలో ఆడపిల్లకు ఇప్పటికీ రక్షణ కరువే... పేదవాడికి ఎప్పటికి న్యాయం కరువే.

2 comments:

  1. అసలు నేరస్థుడు దివంగత వైయెస్సార్ మంత్రివర్గంలో సభ్యుడైన ఒక ఎస్సీ మంత్రిగారి కుమారుడని వినికిడి.

    ReplyDelete
  2. అవును కుమార్ గారు... వాళ్ళ పేర్లు ఆయేషా తల్లి చెబుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. న్యాయదేవత కళ్ళకే కాదు, చెవులకు కూడా అడ్డుగోడలు కడుతున్నారు వీళ్ళు.

    ReplyDelete